
- ఫీల్డ్ విజిట్ అయ్యాక అప్రూవల్ చేయడానికి ఇబ్బందులు
- ఎన్వోసీ ఇచ్చి 10 రోజులైనా ప్రొహిబిటెడ్ లిస్టు నుంచి తొలగించని వైనం
- ఊరు, మండలం పేర్లు ప్పుగా ఎంట్రీ అయితే మార్చుకునేందుకు నో చాన్స్
- ఫీజు చెల్లించాక ప్రొసీడింగ్స్ జారీలోనూ అదే ప్రాబ్లం
కరీంనగర్, వెలుగు : ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం ఫీజుల చెల్లింపు ప్రారంభమై నెల రోజులు దాటినా ఎల్ఆర్ఎస్ పోర్టల్ లో టెక్నికల్ సమస్యలు పరిష్కారం కావడం లేదు. పైగా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఎలాంటి వివాదం లేకున్నా, నిషేధిత భూముల జాబితాలో, చెరువు శిఖాల్లో లేకపోయినా అకారణంగా ప్రొహిబిటెడ్/ఎఫ్టీఎల్ గా పేర్కొన్న ప్లాట్లకు ఇంకా ఫీజు జనరేట్ కావడం లేదు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు ఎల్ 1 నుంచి ఎల్ 2కు, ఎల్ 2 నుంచి ఎల్ 3కి ట్రాన్స్ ఫర్ అవడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో అప్లికేషన్లను అప్రూవల్ చేయడంలో ఆఫీసర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ప్రొహిబిటెడ్ కష్టాలు తీరలే..
ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, శిఖం తదితర భూములు కాకపోయినా, కోర్టు కేసులు లేకపోయినా ఎల్ఆర్ఎస్ పోర్టల్ లో వేలాది ప్లాట్లు అకారణంగా ప్రొహిబిటెడ్ లిస్టులో చేరిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీసుల్లో ఇచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్లాట్ల ఓనర్లు ఆందోళనకు గురవుతున్నారు.
సాఫ్ట్ వేర్ సమస్య వల్లే ప్లాట్లు ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్లాయని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు చెప్పి తప్పించుకుంటున్నారు. అన్ని క్లియర్ గా ఉన్న తమ ప్లాట్లను ప్రొహిబిటెడ్ జాబితాలో ఎలా చేరుస్తారని పలుచోట్ల సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
ఫీజు చెల్లించాక ప్రొసీడింగ్స్ జారీలోనూ జాప్యం..
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 5 లక్షల మందికిపైగా ఎల్ఆర్ఎస్ చార్జీలు చెల్లించగా.. ప్రొసీడింగ్స్ కాపీలు మాత్రం కేవలం లక్షలోపే జనరేట్ అయినట్లు తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి 20 రోజులు దాటినా చాలా మందికి ఇప్పటి వరకు ప్రొసీడింగ్స్ కాపీలు జనరేట్ కాలేదు. ఫీజులు కట్టించుకోవడంలో హడావుడి చేసిన సిబ్బంది, ఆ తరువాత పట్టించుకోవడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే మార్చి 31 వరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి.. ల్యాప్ టాప్ లు ముందు పెట్టుకుని దరఖాస్తుదారుల సందేహాలు తీర్చడంతో పాటు అక్కడికక్కడే అప్లికేషన్లలో దొర్లిన తప్పులను సరి చేసిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఇప్పుడు కనిపించడం లేదు. హెల్ప్ డెస్క్ లో ఒకరిద్దరు సిబ్బంది కూర్చుని ఫోన్ లో అప్లికేషన్ స్టేటస్ చూసి చెప్పడం తప్ప, ఏవైనా కరెక్షన్స్ ఉంటే చేయడం లేదు. దీంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
టెక్నికల్ గా అనేక సమస్యలు..
కొందరు దరఖాస్తుదారులు అప్లికేషన్ సమయంలో పేపర్లను అప్ లోడ్ చేయలేదు. దీంతో ఇప్పుడు షార్ట్ ఫాల్ చూపిస్తోంది. అలాంటి వారు పేపర్లు అప్ లోడ్ చేశాక ఎల్-1 ఆఫీసర్ కు వెళ్లాల్సి ఉంటుంది. సదరు ఆఫీసర్ అప్రూవ్ చేశాక ఎల్ 2 ఆఫీసర్ కు వెళ్లాలి. కానీ ఆ అప్లికేషన్ వచ్చినట్లే వచ్చి మళ్లీ ఎల్ 1 ఆఫీసర్ కు రిటర్న్ పోతుంది.
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాక ఎల్ 1 ఆఫీసర్ ఫీల్డ్ విజిట్ చేసి అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఫీల్డ్ విజిట్ చేసే ముందు అప్లికేషన్ వివరాలు పరిశీలిద్దామంటే కొన్ని అప్లికేషన్లు కనిపించడం లేదు. అలాగే ఎల్ 1 తర్వాత ఎల్-2 ఆఫీసర్ కు, అక్కడి నుంచి ఎల్-3కి వెళ్లాల్సి ఉండగా.. కింది ఆఫీసర్ లాగిన్ కు వచ్చి చేరుతున్నాయి.
చాలా మంది ప్లాట్ల ఓనర్లు ఇంటర్నెట్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఎల్ఆర్ఎస్ కు అప్లై చేశారు. ఈ క్రమంలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొందరు ఊరు, మండలం పేర్లు తప్పుగా ఎంట్రీ చేశారు. ప్రస్తుతం ప్లాట్ల నంబర్లు తప్పుగా పడితే మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఊరు, మండలం పేర్లు మార్చుకునే అవకాశం లేదు.
జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో లతకు 252 చదరపు మీటర్ల ప్లాట్ ఉంది. ఈ ప్లాట్ రెగ్యులరైజేషన్ కోసం ఇటీవల 25 శాతం రిబేట్ తో రూ.45,935 ఫీజు చెల్లించారు. మూడు రోజుల కింద మున్సిపల్ ఆఫీసర్లు ఫోన్ చేసి ఫీల్డ్ విజిట్ కు వస్తామని చెప్పారు. మరుసటి రోజు దరఖాస్తుదారు ఫోన్ చేస్తే తమ లాగిన్ లో ఆ ఫైల్ చూపించడం లేదని చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన లత కుటుంబసభ్యులు రెండు రోజులుగా పనులు మానుకుని ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఆఫీసర్లు మాత్రం టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెపుతూ ఫీల్డ్ విజిట్ కు రావడం లేదు.
వరంగల్ నగరంలోని పైడిపల్లిలోని 1245 సర్వే నంబర్ ఐజీఆర్ఎస్ రికార్డుల ప్రకారం ప్రొహిబిటెడ్ జాబితాలో లేదు. కానీ, ఈ సర్వే నంబర్ లోని 5,6,9 ప్లాట్లకు ఫీజు జనరేట్ అయి ఫీజు చెల్లించగా.. మిగతా ప్లాట్లు ఎల్ఆర్ఎస్ పోర్టల్ లో ప్రొహిబిటెడ్, ఎఫ్టీఎల్ గా కనిపిస్తున్నాయి. ఈ సర్వే నంబర్ ప్రొహిబిటెడ్ లో లేదని వరంగల్ సబ్ రిజిస్ట్రార్ ధ్రువీకరిస్తూ ప్లాట్ల ఓనర్లకు ఎన్వోసీ కూడా జారీ చేశారు. ఆ ఎన్వోసీని కార్పొరేషన్ ఆఫీసులో ఇవ్వడంతోపాటు పోర్టల్ లో అప్ లోడ్ చేసి 10 రోజులైనా ఇప్పటి వరకు ఫీజు ఇంటిమేషన్ లెటర్ జనరేట్ కాలేదు. ఇంకా ప్రొహిబిటెడ్ గానే చూపిస్తోంది. ఇదేంటని అడిగితే సమస్య పోర్టల్ వల్లేనని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు చెబుతున్నారు.